మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు తెలంగాణ అసెంబ్లీ నివాళి
ఆర్థిక సంస్కరణ రూపశిల్పి: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం సందర్భంగా మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్కు గౌరవ నివాళి అర్పించింది. ఈ సందర్భంగా సంతాప తీర్మానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు.
మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలోనే తెలంగాణ ఏర్పాటు జరిగిందని సీఎం పేర్కొన్నారు. ఆయన కృషిని ప్రస్తావిస్తూ, ఆయనతో సమానంగా పోటీపడగల నాయకులు లేరని తెలిపారు. ఎవరు విమర్శించినా వాటిని నిర్లక్ష్యంగా తీసుకొని తన పనిని దృఢంగా కొనసాగించడంలో ఆయన నిరుపమానుడని అన్నారు.
ఆర్థిక సంస్కరణల్లో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారని, అంతర్జాతీయ స్థాయిలో ఆయనను ఆర్థిక సంస్కరణ రూపశిల్పిగా అభివర్ణించారు. ఉపాధి హామీ, సమాచార హక్కు వంటి చట్టాలను తీసుకురావడంలో ఆయన దోహదం చేయడాన్ని ముఖ్యమంత్రి కొనియాడారు.
తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడంలో మన్మోహన్ సింగ్ నాయకత్వం కీలకమని రేవంత్ అన్నారు. ఆయనకు భారత రత్న అవార్డు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
"మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులతో నాకు ఏర్పడిన అనుబంధం చిరస్మరణీయమైనది" అని ముఖ్యమంత్రి అన్నారు. "తెలంగాణపై ఆయన సతీమణి చూపిన ప్రేమ ప్రత్యేకమైనది" అని వ్యాఖ్యానించారు.
తెలంగాణలో మన్మోహన్ సింగ్ విగ్రహం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు.

Post a Comment