తెలంగాణలో గురుకుల పాఠశాలలపై జిల్లా కలెక్టర్ల ఫోకస్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురుకుల విద్యాలయాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇటీవల హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకోవడంతో ప్రభుత్వం అలర్ట్ అయి, గురుకులాలు, కేజీబీవీలు, ప్రభుత్వ హాస్టళ్ల నిర్వహణపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని నిర్ణయించింది.
ఇందులో భాగంగా, జిల్లా అదనపు కలెక్టర్లకు గురుకులాల బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యా వ్యవస్థను ప్రభావవంతంగా మార్చడంలో, నాణ్యమైన విద్యను అందించడంలో భాగంగా మహిళా ఐఏఎస్లు, అదనపు కలెక్టర్లు గురుకులాల నిర్వహణను పర్యవేక్షిస్తారు.
అదనపు కలెక్టర్లు హాస్టళ్లను సందర్శించి విద్యార్థులు, సిబ్బందితో మాట్లాడి అక్కడి పరిస్థితులను సమీక్షిస్తారు. బాలికల గురుకులాల బాధ్యతను ప్రత్యేకంగా మహిళా ఐఏఎస్ అధికారులకు అప్పగించారు. విద్యాలయాల్లో ఎదురవుతున్న లోపాలను గుర్తించి, వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రభుత్వ ఆదేశాలు:
ఏడు రోజుల్లోగా గురుకుల విద్యాలయాలపై సంబంధిత ఎస్సీ, బీసీ, మైనారిటీ, విద్యా శాఖలకు నివేదిక సమర్పించాలి.
హాస్టళ్ల సరుకుల కొనుగోలు కమిటీలకు అదనపు కలెక్టర్లే చైర్మన్లుగా వ్యవహరించాలి. మహిళా ఐఏఎస్లు 15 రోజుల్లోకొక్కసారి బాలికల గురుకులాలను సందర్శించాలి. ఈ సందర్శనలో ఒక రాత్రి బస చేయాలి.
ఈ చర్యల ద్వారా గురుకులాల నిర్వహణలో ఉన్న లోపాలను సరిదిద్దడంతో పాటు విద్యార్థులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని సంబంధిత అధికారులు తెలిపారు.

Post a Comment