కరీంనగర్, స్వామీజీ వేషం వేసుకుని పూజల పేరుతో అమాయకుల నుండి లక్షల రూపాయలు వసూలు చేసి, బంగారు కడ్డీ ఉందని నమ్మబలికి మోసాలకు పాల్పడుతున్న ముఠాను కరీంనగర్ రూరల్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఈ ముఠాలో ఐదుగురు సభ్యులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుండి రూ.15 లక్షల 30 వేల నగదు, 7 తులాల బంగారం, మూడు కార్లు, 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
మంత్రాల మాటలతో మాయ చేసిన ముఠా:
ఈ మోసాల ముఠా కార్యకలాపాలు కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూశాయి. శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన గజ్జి ప్రవీణ్ (25), తండ్రి కనకయ్య ఆర్టీసీ వేములవాడ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇటీవల ప్రమాదంలో ప్రవీణ్ తండ్రి కాలు విరిగింది. తల్లి కూడా అనారోగ్యంతో బాధపడుతోంది. కుటుంబంలో ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని పది రోజుల క్రితం స్వామీజీ వేషంలో ఉన్న ఓ వ్యక్తి ప్రవీణ్ను సంప్రదించాడు.
అతను ప్రవీణ్ ఇంట్లో శనిదోషం ఉందని, వారి ఇంటి పక్కనే క్వింటాల్ బరువు గల బంగారు కడ్డీ గోతిలో పాతి ఉందని తెలిపాడు. దానిని బయటకు తీసి పూజలు చేస్తే కుటుంబ ఆరోగ్యం మెరుగవుతుందని, లేకపోతే తండ్రి నెలలోపే మృతిచెందుతాడని భయపెట్టాడు. అందుకోసం పూజా సామాగ్రి కొనుగోలు చేయాల్సిందిగా నమ్మబలికాడు.
విడతలవారీగా డబ్బుల వసూలు:
ప్రవీణ్ ఆ మాటలు నమ్మి పూజల కోసం ఇప్పటి వరకూ రూ.15.30 లక్షలు దశలవారీగా చెల్లించాడు. ముఠా సభ్యులు కొంత పూజా సామాగ్రిని కొనుగోలు చేసి, ఇంటి పక్కన గొయ్యి తవ్వి, కుంకుమ, పసుపు చల్లించి, అందులో ఓ డబ్బా పెట్టారు. అందులో కిలో బంగారం ఉందని చెప్పి, ఆ డబ్బాను దేవుడి గదిలో ఉంచమని సూచించారు. అనంతరం మరిన్ని డబ్బులు కోరుతూ బెదిరింపులకు దిగారు. ప్రవీణ్ నిరాకరించగా, "నీ నాన్నను ఇక్కడే చంపి పాతిపెడతాం" అని బెదిరించారు. ఈ బెదిరింపులకు భయపడి ప్రవీణ్ చుట్టుపక్కల వారి నుండి అప్పుగా డబ్బులు తెచ్చి వారికి ఇచ్చినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.
కేసు నమోదు – ముఠా అరెస్ట్:
బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను పట్టుకున్నారు. ఈ కేసును కరీంనగర్ రూరల్ ఏసీపీ శుభం ప్రకాష్ పర్యవేక్షించారు. అరెస్ట్ చేసిన సమయంలో వారిలో మంత్రివాదిగా మాయ చేయగల నైపుణ్యం ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారు.
ఈ కేసు దర్యాప్తులో కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్, ప్రత్యేక బృందం సభ్యులు కీలక పాత్ర పోషించారు. పోలీసులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి మోసపూరిత వాగ్దానాలను నమ్మవద్దని హెచ్చరిస్తున్నారు.
మారుమూల ప్రాంతాల్లో భయభక్తులను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న ఇలాంటి ముఠాలపై పోలీసులు దృష్టి సారించారు.
Post a Comment