బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకై మోడ్రన్ ఇఖ్రా స్కూల్ లో అవగాహన సదస్సు
కొత్తగూడెం, ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 12వ వార్డు, సుభాష్ చంద్రబోస్ నగర్, రామవరం ప్రాంతంలోని మోడ్రన్ ఇఖ్రా స్కూల్ లో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ షేఖ్ అబ్దుల్ బాసిత్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు సందేశమిచ్చారు.
"చిన్నారుల చేతుల్లో పుస్తకాలుండాలి.. పనిముట్లు కాదు" అని ఉద్ఘాటించిన బాసిత్ గారు, పిల్లలు ఆటలతో ఆనందంగా గడపాల్సిన వయస్సులో, ఇటుకబట్టీల్లో, టపాసుల ఫ్యాక్టరీలలో శ్రమించడం అమానుషమన్నారు.
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించాలంటే సామాజిక, ఆర్థిక మార్పులు అవసరమని, ప్రత్యేకంగా పేద కుటుంబాల జీవన విధానాన్ని మెరుగుపరచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కేవలం సంవత్సరానికి ఒక్కసారి ఉపన్యాసాలు ఇచ్చే కార్యక్రమాలు కాకుండా, నిరంతర చైతన్యంతో ముందుకెళ్లాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులంతా "బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు కృషి చేస్తాం" అనే ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రధానాధ్యాపకురాలు పర్వీన్ సుల్తానా, ఉపాధ్యాయులు ప్రసన్న, సల్మా, నసరత్, విజయలక్ష్మి, సరస్వతీ, లతీఫా, అనితా పాల్గొన్నారు. విద్యార్థులు చురుకుగా పాల్గొని వివిధ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా బాల కార్మిక వ్యతిరేక సందేశాన్ని వినూత్నంగా వ్యక్తం చేశారు.
Post a Comment