ముఖ్యమంత్రికి ఏజెన్సీ ప్రాంత ఎస్సీలకు ఇచ్చిన హామీ గుర్తు చేయండి
హైదరాబాద్, షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు మంగళవారం వినతి పత్రం అందజేశారు. హైదరాబాద్ సెక్రటేరియట్లో సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్, జేఏసీ ప్రతినిధి బృందంతో కలిసి రాష్ట్ర మంత్రిని కలిశారు.
ఈ సందర్భంగా 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాల జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానిక రిజర్వేషన్ విషయంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో అన్యాయం జరిగిందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని రేవంత్ రెడ్డి మాట ఇచ్చినట్లు తెలిపారు. ఆ హామీని అమలు చేయాలని ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకురావాలని కోరారు.
మంత్రిని కలిసిన ప్రతినిధుల విన్నపానికి స్పందించిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఈ విషయం పై ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సమితి జాతీయ కన్వీనర్ జేబీ రాజు, రాష్ట్ర సహాయ కార్యదర్శి దాగుల రమేష్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడ రమేష్, నండూరి నరసింహారావు, బలవంతపు సంపత్ కుమార్, సాల్మన్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment