అడవుల్లో నుంచి జనాల్లోకి.. 21 మంది మావోయిస్టుల లొంగుబాటు (వీడియో)
ఛత్తీస్గఢ్లో నక్సలిజం తగ్గుముఖం పట్టే సూచనలు కనబడుతున్నాయి. బస్తర్ పరిధిలోని కాంకేర్ జిల్లా అంతఘర్ మండలంలోని బర్రెబెడ గ్రామం వద్ద ఆదివారం పెద్ద సంఖ్యలో మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు.
మొత్తం 21 మంది సాయుధ నక్సలైట్లు తమ వద్ద ఉన్న 18 తుపాకులతో సహా లొంగిపోయినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో అత్యంత కీలకమైన కిస్కోడో డివిజన్ కార్యదర్శి ముకేశ్ కూడా ఉన్నట్లు సమాచారం.
పోలీసుల కఠిన చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, తిరుగుబాటుకు ప్రజా మద్దతు తగ్గిపోవడంతో ఈ మావోయిస్టులు ప్రధాన స్రవంతిలోకి చేరాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.
లొంగిపోయిన నక్సలైట్లను టాడోకి పోలీస్ బృందం తీసుకువెళ్లి భానుప్రతాప్పూర్కు తరలించింది. అధికారులు వీరిని పునరావాస పథకాల కింద సాధారణ జీవితంలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు.
సమీప కాలంలో మావోయిస్టుల లొంగుబాట్లు పెరుగుతున్నాయి. ఇటీవల కామ్టెడా శిబిరంలో 50 మంది నక్సలైట్లు లొంగిపోవడం, ఇప్పుడు రామ్ధేర్ బృందం కూడా ఆయుధాలు వదిలేయడం, నక్సలిజం ప్రభావం తగ్గుతోందని సూచిస్తోంది.

Post a Comment