తెలంగాణ బంద్ ప్రశాంతం బీసీ రిజర్వేషన్ల కోసం జేఏసీ బంద్ విజయవంతం
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలనే ప్రధాన డిమాండ్తో బీసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ‘బంద్ ఫర్ జస్టిస్’ కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది.
ఉదయం నుంచి ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమవగా, సాయంత్రం ఐదు గంటల తరువాత మళ్లీ రోడ్డెక్కాయి. హైదరాబాద్ జేబీఎస్ నుంచి కరీంనగర్, సిరిసిల్ల, నిజామాబాద్, కామారెడ్డి, బాన్సువాడ, బోధన్, మెదక్, వేములవాడ, యాదగిరిగుట్ట, సిద్ధిపేట, గజ్వేల్ వంటి ప్రధాన ప్రాంతాలకు బస్సులు బయల్దేరాయి.
బీసీ సంఘాల జేఏసీ విజ్ఞప్తికి అనుగుణంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు సీపీఎం, సీపీఐ లాంటి లెఫ్ట్ పార్టీలు, విద్యార్థి, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. రాష్ట్రవ్యాప్తంగా దుకాణాలు, వ్యాపార సముదాయాలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఆర్టీసీ సేవలు కూడా తాత్కాలికంగా నిలిచిపోయాయి.
జేఏసీ నాయకులు మాట్లాడుతూ, “రాజ్యాంగ సవరణ ద్వారానే బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత సాధ్యమవుతుంది. ఇందుకోసం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై కూడా ఒత్తిడి తెస్తాం” అని తెలిపారు.
ఇటీవలి కాలంలో రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో నం.9పై హైకోర్టు స్టే విధించింది. దీనిని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. ప్రస్తుతం 50 శాతం రిజర్వేషన్ పరిమితి వరకే ఎన్నికలు జరపవచ్చని స్పష్టమవడంతో ఈ అంశం చుట్టూ పీటముడి బిగుసుకుంది.
ఈ పరిణామాలతో బీసీ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్ నిర్వహించాయి. మొత్తం మీద బంద్ ప్రశాంత వాతావరణంలో సాగి, సాయంత్రానికల్లా సాధారణ జీవన విధానం మామూలు స్థితికి చేరుకుంది.
Post a Comment