హైదరాబాద్లో మెట్రో స్టేషన్ వద్ద బుల్లెట్ కలకలం
హైదరాబాద్ మూసపేట్ మెట్రో స్టేషన్లో శనివారం రాత్రి సంచలన ఘటన చోటు చేసుకుంది. భద్రతా తనిఖీల సమయంలో ఓ ప్రయాణికుడి వద్ద బుల్లెట్ లభించడం కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే — బిహార్కు చెందిన మహమ్మద్ అనే యువకుడు ప్రస్తుతం ప్రగతినగర్లో నివసిస్తూ ఫ్యాబ్రికేషన్ పనులు చేస్తున్నాడు. రాత్రి సమయంలో మెట్రోలో ప్రయాణించేందుకు మూసపేట్ మెట్రో స్టేషన్కి వచ్చిన అతడిని భద్రతా సిబ్బంది సాధారణ స్కానింగ్ చేశారు.
ఆ సమయంలో స్కానర్లో బీప్ శబ్దం రావడంతో వారు అప్రమత్తమయ్యారు. వెంటనే మహమ్మద్ వద్ద ఉన్న బ్యాగ్ను చెక్ చేయగా 9 ఎంఎం బుల్లెట్ లభించింది. దీంతో స్టేషన్లో ఒక్కసారిగా హల్చల్ చెలరేగింది.
మెట్రో అధికారులు వెంటనే ఈ విషయం గురించి కూకట్పల్లి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని బుల్లెట్ను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. బుల్లెట్ అతని వద్దకు ఎలా చేరిందనే అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది.
Post a Comment