-->

కానిస్టేబుల్‌ను కత్తితో పొడిచి చంపిన పాత నేరస్థుడు

బైక్‌ చోరీ కేసు నిందితుణ్ని అరెస్ట్‌ చేసి తీసుకెళ్తుండగా కానిస్టేబుల్‌ను కత్తితో పొడిచి చంపిన పాత నేరస్థుడు


నిజామాబాద్‌, అక్టోబరు 17 :నిందితుడిని పట్టుకుని తీసుకెళ్తున్న పోలీసు కానిస్టేబుల్‌పై అతడే కత్తితో దాడి చేసి చంపిన ఘటన నిజామాబాద్‌లో సంచలనం సృష్టించింది.

సీసీఎస్‌ ఎస్‌ఐ విట్టల్‌, కానిస్టేబుల్‌ ప్రమోద్‌ కలిసి పట్టణంలోని నాగారం ప్రాంతానికి చెందిన పాత నేరస్థుడు రియాజ్‌‌ను బైక్‌ చోరీ కేసులో అరెస్టు చేశారు. శుక్రవారం రాత్రి వినాయక్‌ నగర్‌ ప్రాంతం గుండా తీసుకెళ్తుండగా ఈ దారుణం జరిగింది.

కానిస్టేబుల్‌ ప్రమోద్‌ బైక్‌పై రియాజ్‌ను వెనుక కూర్చోబెట్టుకొని వెళ్తుండగా, రియాజ్‌ వెనుక నుంచి ఛాతీలో కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడ్డ ప్రమోద్‌ను అటుగా వెళ్తున్న మోపాల్‌ ఎస్సై తక్షణమే జిల్లా ఆస్పత్రికి తరలించినా, మార్గమధ్యంలోనే ఆయన మృతిచెందారు.

దాడి అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఎస్సైపై కూడా రియాజ్‌ దాడి చేసి గాయపరిచినట్లు సమాచారం. అనంతరం రియాజ్‌ అక్కడినుంచి పారిపోయాడు. ప్రస్తుతం అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

2003 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్‌ ప్రమోద్‌ ఇటీవల ట్రాఫిక్‌ విభాగం నుంచి సీసీఎస్‌కు బదిలీ అయ్యారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. రియాజ్‌పై దొంగతనం, హత్య, చైన్‌ స్నాచింగ్‌ వంటి పలు కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793