పెద్దపల్లి జిల్లా, సుల్తానాబాద్లో క్షుద్ర పూజల కలకలం!
పెద్దపల్లి జిల్లా, సుల్తానాబాద్: సుల్తానాబాద్ ఎస్సారెస్పీ కార్యాలయం సమీపంలోని రోడ్డుపై గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించడం స్థానికుల్లో భయాందోళన కలిగించింది. రహదారిపై విస్తారంగా అన్నముద్దలతో పాటు పసుపు, కుంకుమ పూసి, నిమ్మకాయలు, కొబ్బరికాయలు ఉంచిన దృశ్యం ఉదయం స్థానికులు గమనించారు.
ప్రతి ఆదివారం, గురువారం రోజుల్లో ఈ రోడ్డుపై ఇలాంటి క్షుద్ర పూజలు తరచుగా జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారిపై ‘తిప్పి’ వస్తువులను రోడ్డుపై వదిలేస్తున్నారని వారు తెలిపారు.
రాత్రివేళ రోడ్డుపై ఈ వస్తువులపై నుంచి ఎవరు దాటినా అనర్థం జరుగుతుందనే భయంతో ప్రజలు వణికిపోతున్నారు. ఉదయం వాకింగ్కి వెళ్లేవారు కూడా ఆ రోడ్డును దాటడానికే వెనుకాడుతున్నారు.
సాంకేతిక రంగం ఎంత అభివృద్ధి చెందినా, ఇలాంటి మూఢనమ్మకాలు ప్రజల్లో ఇంకా కొనసాగడం ఆందోళన కలిగించే విషయమని జనవిజ్ఞాన వేదిక ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రజలు ఇలాంటి మూఢ విశ్వాసాలను దూరం పెట్టాలని వారు విజ్ఞప్తి చేశారు.
Post a Comment