కరీంనగర్లో విద్యార్థులతో శ్రమదానం పేరుతో ప్రమాదకర పనులు
కరీంనగర్ టౌన్ : విద్యాబుద్ధులు నేర్పి, విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దాల్సిన గురువులు వివాదాస్పద చర్యలకు పాల్పడ్డారు. కరీంనగర్ పట్టణంలోని పద్మనగర్ ఎదురుగా ఉన్న డైరీ పెట్రోల్ బంక్ సమీప ప్రభుత్వ హైస్కూల్లో విద్యార్థులను లేబర్ పనులు చేయించారు.
విద్యార్థులను పాఠశాల భవనం పైకి ఎక్కించి చెత్తను పారబోయమని ఆదేశించిన ఉపాధ్యాయుల చర్య తీవ్ర విమర్శలకు గురవుతోంది. పాఠశాల భవనానికి మెట్లు కూడా లేని పరిస్థితిలో, ఒక నిచ్చెనపైకి ఎక్కించి విద్యార్థులతో పని చేయించడం తల్లిదండ్రుల్లో ఆందోళన రేపింది.
తల్లిదండ్రులు “ఇది పిల్లల ప్రాణాలతో ఆటపట్టించడం కాదా?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికులు హెడ్మాస్టర్ దినేష్ కుమార్ను ప్రశ్నించగా, ఆయన “మాకు జీవో వచ్చింది, విద్యార్థులతో పని చేయించుకోవచ్చని” అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చినట్లు సమాచారం.
పాఠశాలలలో శుభ్రత కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఆయాలను నియమించినప్పటికీ, వారిని పక్కన పెట్టి విద్యార్థులతో లేబర్ పనులు చేయించడం అధికార నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది.
ఈ ఘటనపై విద్యా శాఖ తక్షణ విచారణ జరిపి, సంబంధిత హెడ్మాస్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Post a Comment