బస్సు–రైలు అనుభవంతోనే విమానం ఎక్కారు… చివరకు కిందకు దించేశారు!
శంషాబాద్, జనవరి 27: తెలియక చేసిన తప్పు కూడా కొన్నిసార్లు పెద్ద ఇబ్బందులకు దారి తీస్తుందనడానికి ఇదే ఉదాహరణ. విమాన ప్రయాణ నిబంధనలపై అవగాహన లేక శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది.
బస్సు, రైలు ప్రయాణాల్లో చిన్నపిల్లలకు ప్రత్యేక టికెట్ అవసరం ఉండదన్న అనుభవంతో, విమానంలో కూడా అలాగే ఉంటుందనుకున్న ఓ మహిళ తన మనవడికి టికెట్ తీసుకోలేదు. ఆమె తనకు, తన కుమారుడికి మాత్రమే టికెట్లు తీసుకుని, చిన్నారిని వెంట తీసుకొచ్చింది.
విమానాశ్రయంలోని భద్రతా తనిఖీల సమయంలో ఈ విషయం ఎవరి దృష్టికీ రాకపోవడంతో, ఆ కుటుంబం విమానం కూడా ఎక్కింది. విమానంలో ఖాళీగా ఉన్న సీట్లో బాలుడిని కూర్చోబెట్టారు. అయితే ఆ సీటుకు చెందిన అసలు ప్రయాణికుడు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
బాలుడికి టికెట్ లేకపోవడాన్ని గుర్తించిన ఎయిర్ హోస్టెస్ వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అధికారులు స్పందించి ఆ మహిళను, ఆమె కుమారుడిని, బాలుడిని విమానం నుంచి కిందకు దింపి పోలీసులకు అప్పగించారు.
పోలీసుల విచారణలో వారు బిహార్లోని పాట్నాకు వెళ్తున్నామని, ఇది తమ మొదటి విమాన ప్రయాణమని తెలిపారు. చిన్న పిల్లలకు కూడా విమాన టికెట్ తప్పనిసరిగా తీసుకోవాలన్న విషయం తెలియకపోవడంతోనే ఇలా జరిగిందని చెప్పారు.
వారి అమాయకత్వాన్ని పరిగణనలోకి తీసుకున్న పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయకుండా వారిని విడిచిపెట్టారు. అయితే టికెట్ లేకపోవడంతో విమానం నుంచి దించేయడంతో, ముందే తీసుకున్న రెండు టికెట్ల డబ్బు మాత్రం వృథా అయింది. తెలియక చేసిన తప్పుకైనా మూల్యం తప్పదన్న విషయాన్ని ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది.

Post a Comment