-->

ప్రియుడు అనుమానం వేధింపులు.. యువతి ఆత్మహత్య

ప్రియుడు అనుమానం వేధింపులు.. యువతి ఆత్మహత్య


రంగారెడ్డి జిల్లా | జనవరి 08 : ప్రియుడు అనుమానంతో చేసిన వేధింపులు ఓ యువతి ప్రాణాలు తీసిన విషాద ఘటన రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగోల్‌లో చోటుచేసుకుంది. ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావని అనుమానిస్తూ గొడవకు దిగడంతో మనస్థాపం చెందిన యువతి ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంక్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…ఖమ్మం సమీపంలోని కొత్తగూడెం పట్టణానికి చెందిన ఐశ్వర్య (19) తన అన్న అరవింద్‌తో కలిసి నాగోల్‌లోని తట్టి అన్నారం వైఎస్ఆర్ కాలనీలో అద్దెకు నివాసం ఉంటోంది. ఐశ్వర్య నగరంలో ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది.

వీరిద్దరికీ దూరపు బంధువైన మహేష్ అలియాస్ ఆనంద్ (23) సూర్యాపేటకు చెందినవాడు. ప్రస్తుతం నగరంలోని హస్తినాపురంలో నివసిస్తూ ఆటో నడుపుతున్నాడు. బంధుత్వం కారణంగా ఆనంద్ తరచూ ఐశ్వర్య ఇంటికి వచ్చేవాడు. ఈ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది.

సుమారు ఏడాది క్రితం జరిగిన అయ్యప్ప పూజ కార్యక్రమంలో ఐశ్వర్యను చూసిన ఆనంద్, ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి వెంటపడ్డాడు. మొదట పెద్దలు ఈ వివాహానికి నిరాకరించినప్పటికీ, తర్వాత నచ్చజెప్పడంతో ఒప్పుకున్నారు.

అయితే ఇటీవల ఐశ్వర్య మరెవరితోనో ఫోన్‌లో మాట్లాడుతోందన్న అనుమానంతో ఆనంద్ ఆమెను తరచూ వేధించేవాడని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో జనవరి 5న నాగోల్ హౌసింగ్ బోర్డు కాలనీలోని ఓ ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంక్ వద్ద ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఈ సమయంలో ఫోన్ విషయమై తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

మనస్థాపానికి గురైన ఐశ్వర్య అకస్మాత్తుగా వాటర్ ట్యాంక్‌పైకి ఎక్కి దూకేసింది. తీవ్ర గాయాల పాలైన ఆమెను వెంటనే నాగోల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం ఆమె మృతి చెందింది. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మహేష్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793