తెలంగాణలో మారుతున్న రాజకీయ పరిణామాలు? కొత్త పార్టీకి కవిత సంకేతాలా?
హైదరాబాద్, జనవరి 07: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక మలుపు తిరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావానికి బీజం పడినట్టేనా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పదవికి ఇటీవలే రాజీనామా చేసిన కవిత త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నారనే ప్రచారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని కవిత ప్రకటించడంతో, ఆమె భవిష్యత్ రాజకీయ ప్రణాళికలపై ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయి. తెలంగాణ జాగృతిని కేవలం సామాజిక వేదికగానే కొనసాగిస్తారా? లేక దాన్నే పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారుస్తారా? అన్న సందేహాలకు ఆమె తాజా వ్యాఖ్యలు కొంత స్పష్టతనిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పడం ద్వారా కొత్త పార్టీ ఏర్పాటు దిశగా ఆమె అడుగులు వేస్తున్నారన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో బలపడుతోంది.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత మల్రెడ్డి రంగారెడ్డి చేసిన “కవిత కాంగ్రెస్లో చేరినా ఆశ్చర్యం లేదు” అన్న వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి. ఈ మాటలు కొత్త పార్టీనా? లేక పార్టీ మార్పా? అనే చర్చలకు మరింత ఊపునిచ్చాయి.
గులాబీ పార్టీపైనే గురి పెట్టిన విమర్శలు
ఇప్పటివరకు కవిత రాజకీయ విమర్శల దిశ స్పష్టంగా మారింది. నిన్న మొన్నటి వరకు హరీశ్రావుపై ప్రధానంగా విమర్శలు చేసిన ఆమె, అప్పుడప్పుడు కేటీఆర్పై, మధ్యలో సంతోష్పై సెటైర్లు వేసింది. కానీ ఇప్పుడు మాత్రం డైరెక్ట్గా బీఆర్ఎస్ అధినేత, ‘గులాబీ బాస్’ కేసీఆర్పైనే బాణాలు సంధిస్తున్నారు. పేరు నేరుగా ప్రస్తావించకపోయినా, కల్వకుంట్ల కుటుంబమే లక్ష్యంగా ఆమె రాజకీయ పోరాటం ఉండబోతుందన్న సంకేతాలను కవిత వ్యాఖ్యలు స్పష్టంగా ఇస్తున్నాయి.
బీఆర్ఎస్కు, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తర్వాత కవిత విమర్శల తీవ్రత మరింత పెరిగింది. ఎక్కడికెళ్లినా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులే ఆమె టార్గెట్గా మారుతున్నారు. శాసనమండలి వేదికగా కేసీఆర్ తొమ్మిదిన్నరేళ్ల పాలనపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి. బీఆర్ఎస్ పాలన అవినీతిమయమని పరోక్షంగా ఆరోపిస్తూ, టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి జాతీయ రాజకీయాల వైపు వెళ్లడాన్ని తీవ్రంగా ప్రశ్నించారు.
బీఆర్ఎస్ నేతల మౌనం వెనుక కారణమిదేనా?
కవిత ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ, కల్వకుంట్ల కుటుంబం నుంచి మాత్రం ఎలాంటి ప్రత్యక్ష స్పందన రాకపోవడం గులాబీ పార్టీలోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు ముగ్గురిలో ఎవరు స్పందించినా ప్రభావం వేరేగా ఉంటుందని బీఆర్ఎస్ నేతలే అంతర్గతంగా చర్చించుకుంటున్నట్టు సమాచారం.
కవిత ఆరోపణలు పార్టీకి నష్టం కలిగించే అవకాశం ఉందని కొందరు నేతలు భావిస్తుండగా, కనీసం కేటీఆర్ లేదా హరీశ్రావు అయినా స్పందించకపోతే పార్టీ క్యాడర్ అయోమయంలో పడే ప్రమాదం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మహిళా నేతలతో కౌంటర్ ఇప్పించినా అది ప్రజల్లోకి బలంగా వెళ్లదన్న భావన కూడా ఉంది.
అయితే, ఈ మౌనం వెనుక అసలు కారణం వేరేనన్న టాక్ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. కవిత ఎంత విమర్శించినా ఆమె కేసీఆర్ కూతురే కావడం వల్ల, కుటుంబ సభ్యులుగా కేటీఆర్, హరీశ్రావు స్పందించడంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. కుటుంబ వ్యవహారాన్ని రాజకీయంగా మరింత పెంచకూడదన్న ఆలోచనతోనే ఈ మౌనం కొనసాగుతోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
మొత్తానికి, కవిత రాజకీయ ప్రయాణం ఎటు మలుపు తిరుగుతుందో? కొత్త పార్టీతో తెలంగాణ రాజకీయాలను ఎంతవరకు కుదిపేస్తుందో? అనే ప్రశ్నలకు సమాధానాలు రావాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. అయితే, ఒక విషయం మాత్రం స్పష్టం—తెలంగాణ రాజకీయాలు మరోసారి హీట్ ఎక్కుతున్నాయి.

Post a Comment