ట్రాన్స్కో డీఈ ఇంటిపై ఏసీబీ దాడులు.. 12 చోట్ల సోదాలు
ట్రాన్స్కో డీఈ ఇంటిపై ఏసీబీ దాడులు.. 12 చోట్ల సోదాలు
హైదరాబాద్: నగరంలోని కొండాపూర్ ప్రాంతంలో తెలంగాణ ట్రాన్స్కో డీఈ ముత్యం వెంకట రమణ నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన పలు ప్రాంతాల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు బుధవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు.
ఏసీబీ డీఎస్పీ మాజిద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో ఇజ్జత్నగర్లోని హైటెక్స్ సమీపంలో ఉన్న నివాసంతో పాటు మొత్తం 12 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. డీఈ ముత్యం వెంకట రమణ తన ఆదాయానికి మించిన అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం అందడంతో ఈ దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
కొండాపూర్లోని మీనాక్షి స్కై లాంజ్ అపార్ట్మెంట్లో ఉన్న నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన ఇతర ఇళ్లు, కార్యాలయాలు, బంధువుల నివాసాల్లో కూడా ఏసీబీ బృందాలు తనిఖీలు చేపట్టాయి. సోదాల్లో కీలక పత్రాలు, ఆస్తులకు సంబంధించిన వివరాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
సోదాలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో అక్రమ ఆస్తుల విలువ, స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఇతర వివరాలను ఏసీబీ అధికారులు పూర్తి తనిఖీల అనంతరం వెల్లడించనున్నారు.

Post a Comment