ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని వేగంగా ఆటో ఢీకొని మృతి
ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని వేగంగా ఆటో ఢీకొని మృతి
ఆలేరు రూరల్, జూలై 22: ఇంటి ముందు అమాయకంగా ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారిని మృత్యువు ఆటో రూపంలో కబళించింది. వేగంగా వచ్చిన ట్రాలీ ఆటో ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన చిన్నారి చికిత్స పొందుతూ మృతిచెందిన విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది.
పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శ్రీరాముల కరుణాకర్, కీర్తన దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కరుణాకర్ గ్రామంలోనే సెలూన్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరి రెండో కుమార్తె శ్రీహన్సిక (3) మంగళవారం ఉదయం ఇంటి ముందు రోడ్డుపై ఆడుకుంటుండగా, అదే గ్రామానికి చెందిన ట్రాలీ ఆటో వేగంగా వచ్చి చిన్నారిని ఢీకొట్టి ఆమెపై నుంచి వెళ్లింది.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీహన్సికను స్థానికుల సహాయంతో తల్లిదండ్రులు ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలో చిన్నారి మృతిచెందింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
పోలీస్ స్టేషన్ ఎదుట కుటుంబ సభ్యుల ధర్నా
చిన్నారి మృతికి కారణమైన ఆటో డ్రైవర్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆలేరు పోలీస్ స్టేషన్ ఎదుట రెండు గంటల పాటు బైఠాయించి నిరసన చేపట్టారు. బాధ్యుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో వారు ధర్నాను విరమించారు.
చిన్నారి తండ్రి కరుణాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వినయ్ తెలిపారు.

Post a Comment