అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్లకు మంత్రి హోదా.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం
అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్లకు మంత్రి హోదా.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ప్రభుత్వ విప్లుగా కొనసాగుతున్న ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్లకు రాష్ట్ర మంత్రి హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వారికి మంత్రి స్థాయి ప్రోటోకాల్ వర్తింపజేయాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
సమాచారం ప్రకారం, ఈ నిర్ణయానికి సంబంధించిన జీవోను ఈ ఏడాది ఏప్రిల్లో అప్పటి ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పేరుతో సిద్ధం చేసినప్పటికీ, తాజాగా తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది.
తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అద్దంకి దయాకర్ కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. మరోవైపు, బల్మూరి వెంకట్ విద్యార్థి నాయకుడిగా కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతూ జైలుకు కూడా వెళ్లారు. పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేసిన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు.
పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన ఈ ఇద్దరు యువ నాయకులకు మంత్రి హోదా కల్పించడం ద్వారా కష్టపడిన నాయకత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందనే సంకేతాన్ని ఇచ్చిందని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.
అంతేకాకుండా, ఈ మంత్రి హోదా వారి ఎమ్మెల్సీ పూర్తి పదవీకాలం పాటు అమల్లో ఉంటుందని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొనడం విశేషం.

Post a Comment