పెద్ది సుదర్శన్ రెడ్డికి తుది వీడ్కోలు.. భావోద్వేగానికి గురైన హరీశ్ రావు
పెద్ది సుదర్శన్ రెడ్డికి తుది వీడ్కోలు.. భావోద్వేగానికి గురైన హరీశ్ రావు
వరంగల్ జిల్లా, జూలై 31: బీఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో మాజీ మంత్రి హరీశ్ రావు భావోద్వేగానికి గురయ్యారు. తన ఆప్త మిత్రుడికి తుది వీడ్కోలు పలికే క్రమంలో ఆయన కన్నీళ్లు పెట్టుకుని నివాళులర్పించారు. బీఆర్ఎస్ నాయకులతో కలిసి అంతిమయాత్రలో పాల్గొన్న హరీశ్ రావు, సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
పెద్ది సుదర్శన్ రెడ్డికి చివరి వీడ్కోలు పలికేందుకు వేలాది మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు నర్సంపేటకు భారీగా తరలివచ్చారు. చివరిసారిగా తమ అభిమాన నాయకుడిని చూసేందుకు జనం పోటెత్తడంతో పట్టణమంతా జనసంద్రంగా మారింది.
పార్థివ దేహం నర్సంపేటకు చేరుకున్నప్పటి నుంచి వీధులన్నీ ప్రజలతో కిక్కిరిసిపోయాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు బారులు తీరుతూ నివాళులర్పించారు.
అంతిమయాత్ర సందర్భంగా నర్సంపేట ప్రధాన రహదారులపై సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. వాహనాల రాకపోకలు మందగించడంతో పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టి పరిస్థితిని అదుపులో ఉంచారు.

Post a Comment