దుబ్బాకలో 32 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
దుబ్బాకలో 32 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ శివారులో అక్రమంగా తరలిస్తున్న 32 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. బొలెరో వాహనంలో ఎలాంటి అనుమతులు లేకుండా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వాహనాన్ని పోలీస్స్టేషన్కు తరలించారు.
దుబ్బాక ఎస్ఐ కీర్తి రాజు ఆధ్వర్యంలో ఈ నెల 14న మల్లయ్యపల్లికి వెళ్లే రహదారిలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పెద్ద చీకోడు గ్రామానికి చెందిన ఎండీ సాదిక్, మహ్మద్ మురాద్ బొలెరో వాహనంలో 32 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు.
వెంటనే పోలీసులు బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ రాజిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పట్టుబడిన రేషన్ బియ్యం విలువ సుమారు రూ.60 వేల వరకు ఉంటుందని ఎస్ఐ తెలిపారు. అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Post a Comment