దారుణం.. వివాహితపై అత్యాచారం చేసి హత్య పోలీసులకు లొంగిపోయారు
.. వివాహితపై అత్యాచారం చేసి హత్య పోలీసులకు లొంగిపోయారు
వెల్దండ, ఆగస్టు 14: నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వివాహితపై అత్యాచారం చేసిన వ్యక్తి.. మరో వ్యక్తితో కలిసి ఆమెను హత్య చేసి, మృతదేహాన్ని తగులబెట్టిన ఘటన కలకలం రేపింది. అనంతరం నిందితులు పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయారు.
వెల్దండ మండలంలోని ఓ గ్రామానికి చెందిన 24 ఏళ్ల యువతి ఆరేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. వారికి ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. ఆమె కల్వకుర్తిలోని ఓ దుకాణంలో పనిచేస్తోంది. బుధవారం సాయంత్రం పని ముగించుకుని స్వగ్రామానికి వెళ్తుండగా, పరిచయమున్న అదే గ్రామానికి చెందిన శ్యాంపురి రాములు ద్విచక్రవాహనంపై ఆమెను ఎక్కించుకున్నాడు.
రాములు హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారి సమీపంలోని పొలాల్లోకి ఆమెను తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ముందస్తు పథకం ప్రకారం తన గ్రామానికే చెందిన నాయని శ్రీనును అక్కడికి పిలిపించాడు. శ్రీను ఆమెను పట్టుకోగా.. రాములు చున్నీతో గొంతు బిగించి హత్య చేసినట్లు వెల్లడించారు.
అనంతరం ఇద్దరూ కలిసి కొట్ర గ్రామ సమీపంలోని ఓ ప్రాంతంలో రెండు బండరాళ్ల మధ్య కట్టెలపై మృతదేహాన్ని ఉంచి డీజిల్ పోసి తగులబెట్టారు. తర్వాత పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయారు.
ఇదిలా ఉండగా, తన భార్య కనిపించడం లేదంటూ మృతురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదైంది. నిందితులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకోగా అప్పటికే మృతదేహం పూర్తిగా కాలిపోయి బూడిదగా మారింది.
గురువారం క్లూస్టీం, ఫోరెన్సిక్ నిపుణులు ఘటనాస్థలిని పరిశీలించి కీలక ఆధారాలను సేకరించారు. నిందితులు రాములు, శ్రీనును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ రఘువీర్రెడ్డి, ఎస్ఐ యుగంధర్రెడ్డి తెలిపారు. కేసుపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Post a Comment