ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్పై ధాన్యం కుంభకోణం కేసు
ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్పై ధాన్యం కుంభకోణం కేసు
రూ.40.96 కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యం మాయమైనట్లు అధికారుల గుర్తింపు
నిర్మల్: ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకురాలు రేఖా నాయక్పై ధాన్యం కుంభకోణం కేసు నమోదైంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సత్తెనపల్లిలో రేఖా నాయక్ పేరిట ఉన్న ఏఆర్ఎస్ రైస్ మిల్లులో భారీగా ప్రభుత్వ ధాన్యం మాయమైనట్లు అధికారులు గుర్తించారు.
అధికారుల తనిఖీలు, రికార్డుల పరిశీలనలో మూడు రబీ సీజన్లకు సంబంధించిన 9,639.962 మెట్రిక్ టన్నుల ధాన్యం లెక్కల్లో లేకుండా పోయినట్లు తేలింది. మాయమైన ధాన్యం విలువ సుమారు రూ.40.96 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
ప్రభుత్వానికి తిరిగి అప్పగించాల్సిన ధాన్యాన్ని లెక్కల్లో చూపకుండా ఇతర మార్గాల్లో మళ్లించారని, తద్వారా ప్రభుత్వ ఆస్తిని దుర్వినియోగం చేసినట్లు అధికారుల నివేదికలో పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఖానాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు క్రైమ్ నంబర్ 165/2026 కింద రేఖా నాయక్పై కేసు నమోదు చేశారు. ఘటనపై ఖానాపూర్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ధాన్యం నిల్వలు, మిల్లుకు సంబంధించిన రికార్డులు, ప్రభుత్వానికి అప్పగించాల్సిన ధాన్యం వివరాలపై పోలీసులు తదుపరి విచారణ చేపడుతున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Post a Comment