ఘోర రోడ్డు ప్రమాదం – నవ వధువు మృతి, భర్తకు గాయాలు
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ వద్ద రాజీవ్ రహదారిపై శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నవ వధువు ముద్ధసాని అఖిల (25) అక్కడికక్కడే మృతి చెందగా, భర్త రాజుకు స్వల్ప గాయాలు అయ్యాయి.
వివరాల్లోకి వెళ్తే—మూడు రోజుల క్రితం అఖిల, రాజు వివాహం జరిగింది. శనివారం అఖిల పీజీ సెట్ పరీక్ష రాసి, భర్తతో కలిసి బైక్పై కరీంనగర్ తిరుగు ప్రయాణంలో ఉండగా, గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఢీకొట్టిన దెబ్బకు అఖిల తలపై తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. భర్త రాజు ప్రాణాపాయం తప్పించుకున్నాడు.
కాళ్ల పారాణి పూర్తికాకముందే ప్రాణాలు కోల్పోవడంతో అఖిల కుటుంబంలో శోకసంద్రం నెలకొంది. కన్నీరుమున్నీరుగా బంధువులు, గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై ఎల్ఎండి ఎస్సై శ్రీకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Post a Comment