లొంగిపోయిన మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ – 106 కేసులు, కోటి రివార్డు
హైదరాబాద్, సెప్టెంబర్ 13 : మావోయిస్టు ఉద్యమానికి కీలక స్తంభంలా ఉన్న పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల కల్పన అలియాస్ మైన్ అక్క, మైన్ బాయి, సుజాత ఈరోజు తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎదుట లొంగిపోయారు. దాదాపు 43 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న ఆమె.. ప్రస్తుతం కేంద్ర కమిటీలో ఉన్న ఏకైక మహిళా నాయకురాలు కావడం విశేషం.
వ్యక్తిగత నేపథ్యం
సుజాత అసలు పేరు పద్మావతి. ఆమె వయసు ప్రస్తుతం 62 ఏళ్లు. జోగులాంబ గద్వాల్ జిల్లా, గట్టు మండలం, పెంచికల్పాడు గ్రామానికి చెందిన ఆమె తండ్రి తిమ్మారెడ్డి వ్యవసాయదారుడు, గ్రామ పోస్ట్మాస్టర్. 1983లో ఆయన మరణించగా, తల్లి వెంకమ్మ గృహిణిగా కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. ముగ్గురు సోదరులు, ఒక సోదరి ఉన్నారు.
ఉద్యమంలోకి అడుగు
1982లో గద్వాల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలోనే కల్పన ఉద్యమ ప్రభావానికి లోనయ్యారు. ఆమె బంధువులు పటేల్ సుధాకర్ రెడ్డి, పోతుల సుదర్శన్ రెడ్డి, సుగుణ ప్రభావంతో మొదట గ్రామ ప్రచారకర్తగా పనిచేశారు. అనంతరం జన నాట్య మండలిలో చేరి గద్దర్, మాల సంజీవ్లతో కలిసి కొంతకాలం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
👉 దీంతో, రాష్ట్రానికి, మావోయిస్టు ఉద్యమానికి ఇది ఒక కీలక పరిణామంగా పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

Post a Comment