ఘోర రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
మెదక్, డిసెంబర్ 14: మెదక్ జిల్లాలో శనివారం రాత్రి చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పెద్ద శంకరంపేట సమీపంలో జాతీయ రహదారి–161పై గుర్తు తెలియని వాహనం బైక్ను ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
మృతులు కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మాగీ గ్రామానికి చెందిన లింగమయ్య, సాయమ్మ, మానస, సాయిగా పోలీసులు గుర్తించారు. రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి బైక్పై వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం.
పెద్ద శంకరంపేట శివారులోని జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం వేగంగా వచ్చి బైక్ను ఢీకొనడంతో బైక్పై ప్రయాణిస్తున్న నలుగురూ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న వెంటనే అల్లాదుర్గం ఎస్సై శంకర్, పెద్ద శంకరంపేట ఏఎస్ఐ సంగమేశ్వర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి కారణాలపై విచారణ చేపట్టిన పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనతో మాగీ గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

Post a Comment