అఖిలేష్ యాదవ్ – సీఎం రేవంత్ రెడ్డితో భేటీ
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ని సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, లోక్సభ సభ్యుడు అఖిలేష్ యాదవ్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన అఖిలేష్ యాదవ్ జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి నివాసంలో కొద్దిసేపు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు.
తెలంగాణ అభివృద్ధి & సంక్షేమ కార్యక్రమాలపై చర్చ
సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సీఎం రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చారు. కొత్త విధానాలు, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు తీసుకుంటున్న చర్యల గురించి ముఖ్యమంత్రి వివరించారు.
‘సదర్ ఉత్సవం’ను రాష్ట్ర పండుగగా ప్రకటించినందుకు అభినందనలు
యాదవులు ఘనంగా జరుపుకునే సదర్ ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించిన ముఖ్యమంత్రి నిర్ణయాన్ని అఖిలేష్ యాదవ్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా యాదవ సమాజం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కృతజ్ఞతతో గుర్తించుకుంటుందని పేర్కొన్నారు. యాదవుల పట్ల ప్రభుత్వం చూపుతున్న గౌరవానికి ధన్యవాదాలు తెలిపారు.
ప్రజాప్రతినిధుల హాజరు
ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ సహా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Post a Comment