రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు కాంస్య విగ్రహ ఆవిష్కరణ
హైదరాబాద్, డిసెంబర్ 15: ఖైరతాబాద్లోని రవీంద్ర భారతి ప్రాంగణంలో ప్రముఖ నేపథ్య గాయకుడు, స్వర సార్వభౌముడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహాన్ని సోమవారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి శ్రీధర్ బాబు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. అలాగే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు.
విగ్రహ ఆవిష్కరణ అనంతరం రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన సభలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడారు. భావితరాలకు స్ఫూర్తినివ్వాలనే ఉద్దేశంతోనే రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్వర సార్వభౌమత్వానికి బాలు నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అనేక తరాలకు ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు.
నెల్లూరులోని తన స్వగృహాన్ని వేద పాఠశాల కోసం బాలు దానం చేసిన విషయాన్ని వెంకయ్య నాయుడు గుర్తు చేశారు. బాలు భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన పాటల రూపంలో ఎప్పటికీ మనతోనే ఉంటారని అన్నారు. ప్రతి ఒక్కరి మనస్సులో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిరస్థాయిగా నిలిచిపోతారని వ్యాఖ్యానించారు.
అయితే రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడాన్ని తెలంగాణ వాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో పాటు ఉద్యమకారుడు పృథ్వీరాజ్ ఈ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నిరసనలకు సిద్ధమైన తెలంగాణ వాదులను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.
ఈ నేపథ్యంలో రవీంద్ర భారతి పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు.

Post a Comment