గంజాయి ముఠా దాడిలో కానిస్టేబుల్కు తీవ్ర గాయాలు… పరిస్థితి విషమం
నిజామాబాద్ జిల్లాలో గంజాయి ముఠా దాడి కలకలం రేపింది. గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు చేపట్టిన తనిఖీల్లో ఓ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడిన ఘటన చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న కానిస్టేబుల్ సౌమ్యాను నిందితులు కారుతో తొక్కుకుంటూ పరారయ్యారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా మారింది.
ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గాయపడిన కానిస్టేబుల్ సౌమ్యాను హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించి ఒక మైనర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, అందులో మూడు కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఘటనలో పాల్గొన్న మిగతా ముఠా సభ్యుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
నిందితులపై హత్యాయత్నం కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న పోలీస్ సిబ్బందిపై ఈ విధమైన దాడులను తీవ్రంగా పరిగణిస్తామని, నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోమని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

Post a Comment