లక్కీ డ్రా పేరిట మోసాలు.. అప్రమత్తంగా ఉండాలి: సీపీ సజ్జనార్ హెచ్చరిక
హైదరాబాద్: లక్కీ డ్రా పేరుతో జరుగుతున్న మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. సోషల్ మీడియాలో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు కార్లు, బైక్స్, ప్లాట్లు, డీజేలు వంటి విలువైన బహుమతులు ఇస్తామని ప్రచారం చేస్తూ లక్కీ డ్రాల పేరుతో అమాయకులను మోసం చేస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చిందన్నారు.
సోషల్ మీడియా వేదికగా ఆకర్షణీయమైన ప్రకటనలు, వీడియోలతో ప్రజల ఆశలను రెచ్చగొట్టి డబ్బులు వసూలు చేస్తున్నారని సీపీ తెలిపారు. ఈ తరహా మోసాల వల్ల చాలామంది ఆర్థికంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
లక్కీ డ్రా నిర్వహిస్తున్న వ్యక్తులు లేదా సంస్థలపై సరైన అనుమతులు, చట్టబద్ధత ఉన్నాయా లేదా అనేది తప్పనిసరిగా పరిశీలించాలని ప్రజలకు సూచించారు. అనుమానాస్పద లక్కీ డ్రాలు, ఆన్లైన్ లింకులు, ఫోన్ కాల్స్కు స్పందించవద్దని సూచించారు.
ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే కేసులు నమోదు చేసి అరెస్టులు కూడా చేస్తామని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. మోసాలకు గురైన వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

Post a Comment