నవ వొకేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో యోగ్యత పత్రాల ప్రదానోత్సవం
పాల్వంచలోని నవ లిమిటెడ్ సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న నవ వొకేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు యోగ్యత పత్రాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఉపాధి అధికారి కె. శ్రీరామ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వెల్డర్, ఫిట్టర్, ఎలక్ట్రికల్ మరియు సోలార్ కోర్సుల్లో శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందజేశారు.
వెల్డర్ కోర్సు పూర్తి చేసిన ఎన్. సాయిబాబు మాట్లాడుతూ, ఈ శిక్షణ తనకు ఎంతో ఉపయోగపడిందని, శిక్షణ అనంతరం వెమ్ టెక్నాలజీస్లో నెలకు రూ.18,000 వేతనంతో ఉద్యోగం పొందినట్లు తెలిపారు.
ముఖ్య అతిథి కె. శ్రీరామ్ మాట్లాడుతూ, నవ లిమిటెడ్ ఆధ్వర్యంలో అత్యాధునిక పరికరాలతో నడుస్తున్న ఈ వృత్తి విద్యా శిక్షణ కేంద్రం స్థానిక నిరుద్యోగ యువతకు గొప్ప అవకాశమని, యువత ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు.
అనంతరం సి.హెచ్. శ్రీనివాసరావు, మేనేజర్ (CSR) మాట్లాడుతూ, ఇప్పటివరకు ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా 2000 మందికి పైగా అభ్యర్థులు వివిధ కోర్సుల్లో శిక్షణ పొందినట్లు తెలిపారు. వీరికి సింగరేణి, కేటీపీఎస్, బీహెచ్ఈఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు కిర్బీ బిల్డింగ్స్, ఎంటార్, హెరిటేజ్ వంటి ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగ అవకాశాలు లభించినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో యు.ఎస్.ఎన్. శర్మ, బిన్ను, సాయి, శ్రావణ్, శ్యామ్, మహేష్, సాయిబాబు, ఉదయ్ కుమార్, అలీ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment