హైడ్రాపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం.. సీఎం రేవంత్కు చెంపదెబ్బ: ఆర్ఎస్ ప్రవీణ్కుమార్
హైడ్రాపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం.. సీఎం రేవంత్కు చెంపదెబ్బ: ఆర్ఎస్ ప్రవీణ్కుమార్
హైదరాబాద్, జూలై 27: హైడ్రా కమిషనర్ను వెంటనే తొలగించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నామని, ఈ తీర్పు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెంపదెబ్బలాంటిదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ వ్యాఖ్యానించారు.
సోమవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పేదల ఇళ్లపై ప్రతాపం చూపేందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే 99 జీవో ద్వారా హైడ్రా సంస్థను ఏర్పాటు చేసిందని ఆరోపించారు. హైడ్రా పేరుతో అమాయక ప్రజలపై అనేక అన్యాయాలు జరిగాయని, పేదల ఇళ్లను విచక్షణారహితంగా కూల్చివేసిందని విమర్శించారు.
హైడ్రా కమిషనర్పై ఏకంగా 63 కోర్టు ధిక్కరణ కేసులు నమోదై ఉండటం రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని ప్రవీణ్కుమార్ అన్నారు. గతంలో హిట్లర్ యూదులను లక్ష్యంగా చేసుకున్నట్లే, నేడు రేవంత్ రెడ్డి హైడ్రాను అడ్డం పెట్టుకుని పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు.
లోతుకుంట, బహదూర్గూడ, అమీన్పూర్ ప్రాంతాల్లో హైడ్రా చేపట్టిన కూల్చివేతలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని ఆయన పేర్కొన్నారు. హైడ్రా మున్సిపల్ శాఖ పరిధిలో పనిచేస్తున్నందున, దాని చర్యలకు ముఖ్యమంత్రే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
హైడ్రాను అడ్డం పెట్టుకుని రియల్ ఎస్టేట్ దందాలు జరుగుతున్నాయని ఆరోపించిన ఆయన, హైడ్రా చర్యలను అడ్డుకునేందుకు ఆర్మీని రంగంలోకి దించాలని హైకోర్టు వ్యాఖ్యానించడం రాష్ట్ర పాలన వైఫల్యానికి నిదర్శనమని అన్నారు.
తప్పు చేసిన అధికారులపై బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ప్రవీణ్కుమార్, అధికారంలోకి వచ్చిన తొలి రోజే హైడ్రాను రద్దు చేస్తామని పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారని, ఆ హామీని తప్పకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు..

Post a Comment