రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రాజంపేట ఎస్ఐ
రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రాజంపేట ఎస్ఐ
కామారెడ్డి జిల్లా: లంచం తీసుకుంటూ రాజంపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ దువ్వల అంజనేయులు ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. అధికారిక పని చేసేందుకు లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
ఈ నెల 20న ఫిర్యాదుదారుడి కుమారుడికి స్టేషన్ బెయిల్ ఇప్పించడంతో పాటు, కేసులో చార్జిషీట్ దాఖలు చేసే సమయంలో మరింత అనుకూలంగా వ్యవహరించేందుకు ఎస్ఐ రూ.30 వేల లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఫిర్యాదుదారుడి నుంచి రూ.30 వేల లంచం తీసుకుంటుండగా, ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఎస్ఐ సూచన మేరకు ఆయన వద్ద నుంచి లంచం సొమ్ము రూ.30 వేలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా తన విధులను నిజాయితీగా నిర్వహించకుండా అక్రమంగా లంచం స్వీకరించినట్లు ఏసీబీ పేర్కొంది. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచినట్లు తెలిపింది.
నిందితుడు దువ్వల అంజనేయులును అరెస్ట్ చేసి, హైదరాబాద్ నాంపల్లిలోని ఎస్పీఈ, ఏసీబీ కేసుల విచారణకు సంబంధించిన గౌరవ II అదనపు ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
లంచం అడిగితే 1064కు ఫిర్యాదు చేయండి
ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ఏసీబీ టోల్ఫ్రీ నంబర్ 1064కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. అలాగే వాట్సాప్ 9440446106, ఫేస్బుక్లో Telangana ACB, ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో @Telangana ACB ద్వారా కూడా ఏసీబీని సంప్రదించవచ్చని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ముఖ్యమైన బహిరంగ ప్రదేశాల్లో ఏసీబీ క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఫిర్యాదుదారు/బాధితుడి పేరు, వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఏసీబీ స్పష్టం చేసింది.

Post a Comment