సింగరేణిలో 600 మంది ఉద్యోగులకు వెంటనే పదోన్నతులు కల్పించాలి
సింగరేణిలో 600 మంది ఉద్యోగులకు వెంటనే పదోన్నతులు కల్పించాలి: తెలంగాణ రక్షణ సేన, హెచ్ఎంఎస్ డిమాండ్
కొత్తగూడెం: సింగరేణి సంస్థలో 2016, 2017 సంవత్సరాల్లో జేఎంఈటీ (JMET) ద్వారా ఉద్యోగాల్లో చేరిన సుమారు 800 మంది ఉద్యోగులకు 2023 నాటికి ఓవర్మెన్గా పదోన్నతులు ఇవ్వాల్సి ఉండగా, కేవలం 200 మందికి మాత్రమే ప్రమోషన్లు కల్పించి, మిగిలిన 600 మంది ఉద్యోగులను పక్కనపెట్టడం తీవ్ర అన్యాయమని తెలంగాణ రక్షణ సేన, హెచ్ఎంఎస్ (హింద్ మజ్దూర్ సభ) నాయకులు ఆరోపించారు.
ప్రమోషన్ల విషయంలో యాజమాన్యాన్ని ప్రశ్నించిన ఉద్యోగులను బదిలీల పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని వారు విమర్శించారు. న్యాయమైన హక్కుల కోసం స్వరం వినిపించిన ఉద్యోగులపై ఒత్తిడి తీసుకురావడం సరికాదని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా, తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కొత్తగూడెంలో ఉద్యోగులు చేపట్టిన 72 గంటల నిరాహార దీక్షకు తెలంగాణ రక్షణ సేన, హెచ్ఎంఎస్ సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పదోన్నతులకు అర్హులైన ఉద్యోగులను వివక్షకు గురిచేయడం వల్ల వారి ఉద్యోగ భవిష్యత్తు, వేతనాలు, సేవా ప్రయోజనాలపై ప్రతికూల ప్రభావం పడుతోందన్నారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించి, అర్హత కలిగిన 600 మంది ఉద్యోగులకు ఎలాంటి ఆలస్యం లేకుండా ఓవర్మెన్ పదోన్నతులు ఇవ్వాలని సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.
యాజమాన్యం మొండి వైఖరిని వీడి ఉద్యోగుల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాలని, లేకపోతే కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని తెలంగాణ రక్షణ సేన, హెచ్ఎంఎస్ నాయకులు హెచ్చరించారు.

Post a Comment