హాస్టల్ చదువులు ఇష్టం లేక.. అర్ధరాత్రి గోడ దూకి పరారైన ముగ్గురు విద్యార్థినులు
హాస్టల్ చదువులు ఇష్టం లేక.. అర్ధరాత్రి గోడ దూకి పరారైన ముగ్గురు విద్యార్థినులు
హనుమకొండ, ఆగస్టు 2: హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెదకొడెపాకలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో శుక్రవారం అర్ధరాత్రి కలకలం చోటుచేసుకుంది. హాస్టల్లో ఉండడం ఇష్టం లేక ముగ్గురు విద్యార్థినులు అర్ధరాత్రి పాఠశాల ప్రహరీ గోడ దూకి బయటకు వెళ్లిపోయారు.
సమాచారం మేరకు, శుక్రవారం రాత్రి సుమారు 2 గంటల సమయంలో పాఠశాల ప్రాంగణంలో ఉన్న పండ్ల ట్రే బాక్సులను గోడకు ఆనించి వాటిపైకి ఎక్కిన విద్యార్థినులు ప్రహరీ గోడ దాటి బయటకు వెళ్లారు. విషయం తెలుసుకున్న పాఠశాల సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు గాలింపు చేపట్టి ముగ్గురు విద్యార్థినులను సురక్షితంగా గుర్తించారు.
అనంతరం బాలికలను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసుల ఎదుట విద్యార్థినులు ఇచ్చిన వాంగ్మూలంలో, హాస్టల్లో ఉండడం తమకు ఇష్టం లేదని, ఆలస్యంగా నిద్రలేస్తే గుంజీలు తీయించడం, గోడ కుర్చీ వేయించడం వంటి శిక్షలు విధిస్తున్నారని పేర్కొన్నట్లు సమాచారం.
ఈ ఘటనపై అధికారులు సీరియస్గా స్పందించారు. విద్యార్థినులు చేసిన ఆరోపణలపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు సంబంధిత తహసీల్దార్ విచారణ చేపట్టారు. విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Post a Comment